మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. కరోనా సమయంలోను రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టాడు. దీంతో వైష్ణవ్ తేజ్కి పెద్ద బేనర్స్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఓ చిత్రాన్ని మొదలు పెట్టాడు.
అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తన మూడో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇప్పటికే లాంచ్ కాగా, సోమవారం నుండి షూటింగ్ మొదలు పెట్టారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నారు. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన ‘రొమాంటిక్’ ‘లక్ష్య’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయగా, ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. క్రిష్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ తో అక్కినేని నాగార్జున ఓ సినిమా రూపొందించనున్నారు. డెబ్యూ డైరెక్టర్ పృథ్వీ తెరకెక్కించే ఈ చిత్రం హాకీ బ్యాక్ డ్రాప్ లో స్పోర్డ్స్ డ్రామా అని.. వైష్ణవ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.