పద్మశ్రీ అవార్డు గ్రహీతకు పింఛన్ మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు
ప్రతి నెలా రూ. 10 వేలు
ఉత్తర్వు పత్రాలు అందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హర్షం వ్యక్తం చేస్తున్న ఆదివాసులు
జైనూర్, మే 31: ఆదివాసీ సంస్కృతిలో కీలకమైన గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న కనకరాజుకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవమిచ్చింది. ప్రతి నెలా రూ. 10 వేల పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్.. కనకరాజును సన్మానించి.. పింఛన్ మంజూరు ఉత్తర్వులను అం దించారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఆదివాసీ సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిస్తుందన్నారు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత కనకరాజుకు ప్రతి నెలా రూ. 10 వేల పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. 70 ఏళ్లుగా ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను భావితరానికి అందించేందుకు కనకరాజు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. కాగా, కనకరాజుకు పింఛన్ మంజూరు చేయడంపై ఆదివాసుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంలో తె లంగాణ భాష సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆదివాసీ నాయకులు ఆత్రం భుజంగ్రావ్, కనక వెంకటేశ్వర్రావ్, మర్సుకోల న్యా నేశ్వర్, పేందుర్ సంజీవ్ తదితరులున్నారు.