విశాల్ని ఓ దర్శకుడు బాధపెట్టాడు. అతని టార్చర్ని భరించలేక విదేశాల్లో రోడ్ల పక్కన కూర్చొని బాధపడ్డాడు విశాల్. ఈ విషయాలను విశాలే స్వయంగా చెప్పారు. ఆయన మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్’ అనే సినిమా చేశారు. ఆ సినిమానే తెలుగులో ‘డిటెక్టీవ్’గా విడుదలైంది. 2017లో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా విడుదలైన ఈ సినిమా అటు తమిళంలో, ఇటు తెలుగులో రెండు భాషల్లోనూ బాగా ఆడింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘తుప్పరివాలన్ 2’ పేరుతో మరో సినిమాను మిస్కిన్ డైరెక్షన్లోనే మొదలుపెట్టారు విశాల్.
ఈ సినిమా షూటింగ్ టైమ్లోనే విశాల్ని మిస్కిన్ టార్చర్కు గురిచేశాడంట. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు విశాల్. “అతనితో కలిసి జీవితంలో పనిచేయను. నా స్థానంలో మరొకరుంటే అతను పెట్టిన టార్చర్కు, పెట్టిన ఖర్చుకూ గుండెపోటుతో చనిపోయేవారు. ‘తుప్పరివాలన్ 2’ నా మనసుకు దగ్గరైన కథ. ఇష్టపడి నేనే నిర్మించాలనుకున్నా. కానీ అతనిది మితిమీరిన ఖర్చు. ఆ బాధ భరించలేక లండన్ ప్లాట్ఫామ్స్పై ఒంటరిగా కూర్చుని బాధపడ్డా. ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం కష్టం. అందుకే షూటింగ్ని మధ్యలోనే ఆపేశా’ అంటూ చెప్పుకొచ్చారు విశాల్. ఇంకా చెబుతూ “ తుప్పరివాలన్ 2’ ప్రాజెక్ట్ నా బిడ్డలాంటిది. అందుకే.. త్వరలో నా స్క్రీన్ప్లేతో ఈ సినిమా తీసుకొస్తా. దర్శకుని వివరాలు త్వరలో చెబుతా” అన్నారు విశాల్.