ఆకట్టుకుంటున్న వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం
డంపింగ్యార్డు, కంపోస్టుషెడ్ నిర్మాణం
శవాన్ని అడ్డుకున్న స్థితి నుంచి..గౌరవంగా సాగనంపే స్థాయికి..
ఆదర్శం.. గైగొళ్లపల్లి పంచాయతీ
కూసుమంచి రూరల్ మార్చి 23: చితి చింత తీరింది. ఆఖరి మజీలికి కష్టాలు తొలగాయి. ఆ పల్లె మృతదేహాన్ని అడ్డుకున్న స్థితి నుంచి గౌరవంగా సాగనంపే స్థాయికి చేరింది. గైగొళ్లపల్లి.. కూసుమంచి మండలంలోని ఓ కుగ్రామం. గతంలో కనీస సౌకర్యాలు లేని ఆ గ్రామం నేడు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ‘పల్లె ప్రగతి’తో ఆ ఊళ్లో వచ్చిన మార్పు, అభివృద్ధి, కేటాయించిన నిధులు, సమకూరిన వసతులపై ‘నమస్తే తెలంగాణ’ కథనం. -కూసుమంచి రూరల్ మార్చి 23
గైగొళ్లపల్లి.. కూసుమంచి మండలంలోని ఓ కుగ్రామం. గతంలో కనీస సౌకర్యాలు లేక ఆ పల్లెవాసులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో శ్మశాన వాటిక ఆఖరి మజిలీకి పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మరణానంతరం తమ ఆత్మీయులకు గౌరవంగా దహన సంస్కారాలు నిర్వహించే పరిస్థితి లేక కుమిలిపోయారు. చెరువు అంచులు, కాల్వకట్టలు, రహదారుల పక్కన పూడ్చి వేయాల్సి వచ్చేది. భక్తరామదాసు ప్రాజెక్టుతో నీరు పుష్కలంగా వస్తోంది. చెరువులు, కుంటలు నిండాయి. కాల్వలు నిరంతరం పారుతున్నాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది. మృతదేహాన్ని పూడ్చేందుకు అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక సందర్భంలో పంట పొలాల్లో, సాగునీటి కాల్వల్లోంచి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో ఆ పల్లె రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరడంతో గైగొళ్లపల్లివాసుల కష్టాలు తీరాయి. గ్రామ సమీపంలో మూడెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అది సుమారు 25 అడుగుల గుట్ట. రాళ్లు, రప్పలతో ఉంది. అయినా సర్పంచ్ ముల్కూరి శ్యాం సుందర్రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. గుట్టను తొలిచి ప్రొక్లెయిన్తో 45 రోజుల పాటు చదును చేసుకున్నారు. ఎకరం పరగాణాలో శ్మశాన వాటిక, మరో ఎకరంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో డంపింగ్ యార్డు నిర్మించారు. 1,806 మంది జనాభా ఉన్న గైగొళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వాత్యాతండా, చింతల తండా, ఉడుతలగూడెం శివారు గ్రామాలున్నాయి. పల్లె ప్రకృతి వనంలో పలు రకాల పండ్ల చెట్లు, పూల, ఔషధ మొక్కలు నాటారు. ఏపీలోని కడియం నుంచి పలు రకాల మొక్కలు తెచ్చి నాటారు.
ప్రగతి పథంలో..
కోట్లాది రూపాయలతో డబుల్ బెడ్రూం ఇండ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, డంపింగ్యార్డు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు వేదిక నిర్మాణాలు జరిగాయి. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, పార్కు ఏర్పాటయ్యాయి. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేయడంతో పారిశుధ్యం ఇతర అవసరాలకు ఉపయోగపడుతున్నది. గ్రామంలో రూ.93 లక్షలతో 18 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. కాలనీలో రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. రూ.1.26 కోట్లతో లింక్ రోడ్లు, రూ.24 లక్షలతో రెండు అంగన్వాడీ కేంద్రాలు, రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ.1.10 కోట్లతో మిషన్ భగీరథ కింద ఆరు వాటర్ ట్యాంకులు నిర్మించారు.
గతంలో ఎన్నో బాధలు పడినం..
మా గ్రామంలో ఎవరైనా మృతిచెందిందితే ఎక్కడ పూడ్చివేయాలో తెలియని పరిస్థితి. పొలాల్లోకి నీళ్లు వస్తే ఇబ్బందే. పల్లెప్రగతి వచ్చాక మాకు కష్టాలు తీరాయి. గుట్టను తొలిచి ప్రభుత్వ సాయంతో శ్మశానవాటికి నిర్మించుకున్నాం. ఊరు బాగుపడింది.. పల్లెలో అన్ని సౌకర్యాలు సమకూరాయి. -వెంకయ్య.. (గైగొళ్లపల్లి గ్రామస్తుడు)