పట్టణాలు, గ్రామాల్లో పాలకవర్గాల అత్యవసర సమావేశాలు
కరోనా కట్టడికి స్వచ్ఛందంగా ముందుకు..
నర్సంపేట, మే 5: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందున గురువారం నుంచి పట్టణంలో స్వచ్ఛంద పాక్షిక లాక్డౌన్ అమలు చేయాలని నర్సంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిలర్ అత్యవసర సమావేశాన్ని బుధవారం చైర్పర్సన్ గుంటి రజిని అధ్యక్షతన నిర్వహించారు. కొన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ విద్యాధర్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వ్యాపారులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలన్నారు. 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు బంద్ చేయాలని కోరారు. నిబంధనలు పాటించని దుకాణాలను సీజ్ చేసి, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నేటి నుంచి పట్టణంలో పాకిక్ష లాక్డౌన్ అమల్లో ఉంటుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కమిషనర్ విద్యాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
వర్ధన్నపేట, మే 5: పట్టణంలో గురువారం నుంచి పాక్షిక లౌక్డౌన్ అమలు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలో ఎస్సై వంశీకృష్ణ, తహసీల్దార్ సూర్యప్రకాశ్తో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నందున పాక్షిక లాక్డౌన్ అమలు చేయాలని పాలకవర్గం తీర్మానం చేసింది. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నేటి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పట్టణంలో వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
12 గ్రామాల్లో..
దుగ్గొండి: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నివారణకు గ్రామాల్లో చర్యలు తీసుకోవాలని డీపీవో చంద్రమౌళి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీ కాట్ల కోమల అధ్యక్షతన కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ నివారణకు మండల పరిధిలో టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీంలో ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సై, వైద్యాధికారులు, ఎంపీవో సభ్యులుగా ఉంటారన్నారు. టీం సభ్యులు మండలంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నిత్యం సమీక్షిస్తారని వెల్లడించారు. ముందస్తుగా మండలంలోని దుగ్గొండి, లక్ష్మీపురం, మహ్మదాపురం, రేఖంపల్లి, దేశాయిపల్లి, బంధంపల్లి, చాపలబండ, వెంకటాపురం, మల్లంపల్లి, గుడ్డేలుగులపల్లి, తిమ్మంపేట, నాచినపల్లిలో లాక్డౌన్ అమలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు డీపీవో సమక్షంలో మండల టాస్క్ఫోర్స్ టీంకు వినతిపత్రం అందించారు. లాక్డౌన్ విధించిన గ్రామాల్లో వందశాతం బెల్ట్షాపులు, హోటళ్లను మూసి వేయాలని తెలిపారు. కిరాణం షాపులను ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో పల్లవి, ఎస్సై రవికిరణ్, వైద్యాధికారులు రాజు, స్వప్న, ఎంపీవో శ్రీధర్గౌడ్, కాట్ల భద్రయ్య పాల్గొన్నారు. కాగా, లక్ష్మీపురంలో బుధవారం నుంచే సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, కార్యదర్శి, గ్రామపెద్దలు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. షాపులు మూసి వేయాలని, ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలోకి ఎవరూ రాకుండా జీపీ సిబ్బంది చూడాలని కోరారు.
కొనసాగుతున్న లాక్డౌన్
శాయంపేట/దామెర: శాయంపేట మండలంలోని ప్రగతిసింగారంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున దుకాణాలు తెరిచి ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునేలా వీలు కల్పించారు. స్థానికులు లాక్డౌన్కు సహకరించాలని సర్పంచ్ పోతు సుమలత విజ్ఞప్తి చేశారు. దామెర మండలంలోని దామెర, తక్కళ్లపహాడ్, ఊరుగొండ, ల్యాదెళ్ల, పులుకుర్తిలో ఉదయం ఆరు నుంచి 8 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. ఊరుగొండలో బెల్ట్షాపుల నిర్వాహకులకు రూ. 1000 చొప్పున జీపీ జరిమానా విధించింది. నిబంధనలు పాటించాలని సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గురిజాలలో..
నర్సంపేట రూరల్: కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతుండడంతో గ్రామాల ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా గురిజాల పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకే అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలని సర్పంచ్ గొడిశాల మమత, ఉప సర్పంచ్ మంచిక హరీశ్గౌడ్, కార్యదర్శి రాజమౌళి, బిల్ కలెక్టర్ కడగండ్ల చిన్ని సూచించారు. మహేశ్వరంలో ఈ నెల 10 వరకు సెలూన్లు బంద్ పాటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రుద్రగూడెంలో మినీ లాక్డౌన్
నల్లబెల్లి: రుద్రగూడెంలో బుధవారం నుంచి గ్రామస్తులు మినీ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు నిర్వహించుకోవాలని సర్పంచ్ మల్లాడి కవిత తెలిపారు. సమావేశంలో గందె శ్రీనివాస్గుప్తా, శివాజీ, దామోదర్రెడ్డి, యాకూబ్పాషా, తిరుపతి, రాజిరెడ్డి, రాములు, సాంబయ్య, సరోజన పాల్గొన్నారు.
రాయపర్తిలో తీర్మానం
రాయపర్తి: కరోనా కట్టడికి రాయపర్తిలో ఈ నెలాఖరు వరకు స్వచ్ఛంద లాక్డౌన్ను అమలు చేస్తున్నట్లు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సర్పంచ్ గారె నర్సయ్య తెలిపారు. మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో సర్పంచ్ గారె నర్సయ్య, ఉప సర్పంచ్ మహమూద్ పాషా నేతృత్వంలో సమావేశమయ్యారు. ఈ నెల 31 వరకు మండలకేంద్రంలోని వర్తక, వాణిజ్య సముదాయాలన్నీ మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కుసుమ సత్యనారాయణకు తీర్మాన ప్రతిని సర్పంచ్ అందజేశారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆకుల సురేందర్రావు, ఎండీ నయీం, కార్యదర్శి జీ అశోక్కుమార్, కారోబార్ కే రాంచంద్రయ్య పాల్గొన్నారు.
నేటి నుంచి తిమ్మాపురంలో..
సంగెం: తిమ్మాపురంలో గురువారం నుంచి సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు సర్పంచ్ గన్ను శారద తెలిపారు. జీపీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామపెద్దలు సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సర్పంచ్ చెప్పారు. గ్రామంలో ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, టీఆర్ఎస్ మండల నాయకుడు గన్ను సంపత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.