చిట్యాల/మునుగోడు/ హాలియా, మే 13 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నల్లగొండ జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతున్నది. పల్లెల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. జిల్లా అంతటా రెండోరోజూ సంపూర్ణంగా కొనసాగింది. పట్టణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తూ లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. గురువారం చిట్యాల మండలంలో ప్రజలు ఉదయం 10గంటల లోపే తమ పనులు పూర్తి చేసుకొని, తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. మునుగోడు మండల కేంద్రంలో చండూరు సీఐ సురేశ్, స్థానిక ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో గస్తీ నిర్వహించారు. మునుగోడులో ప్రతి గురువారం నిర్వహించే వారపు సంత సైతం లాక్డౌన్ వల్ల రద్దయింది. దీంతో ప్రజలు స్థానిక చౌరస్తాలో తోపుడు బండ్ల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. హాలియాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
మిర్యాలగూడ రూరల్/ దామరచర్ల/ నందికొండ/నార్కట్పల్లి/ తిరుమలగిరి సాగర్ : మిర్యాలగూడ రూరల్ పోలీసులు లాక్డౌన్ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. స్టేన్ ద్వారా మూడు పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి వాహనాలను విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి రూరల్ ఎస్సై బొలిశెట్టి సుధీర్కుమార్ అవంతీపురం, ఆలగడప గ్రామాల్లో పర్యటించి లాక్డౌన్ నిబంధలను అతిక్రమించిన వారిని హెచ్చరించి వదిలేశారు. ఉదయం 6 నుంచి 10గంటలకు మాత్రమే తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. దామరచర్ల మండల ప్రజలు 10గంటల్లోపే మండల కేంద్రానికి చేరుకొని నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. నందికొండలో ఉదయం లాక్డౌన్ సడలింపు సమయంలో మార్కెట్లో సందడి కనిపించింది. నార్కట్పల్లి మండల కేంద్రంలో 4, నెమ్మానిలో 2 కేసులు నమోదు చేయగా, 24మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు ఎస్సై యాదయ్య తెలిపారు. తిరుమలగిరి సాగర్ మండలంలో 14మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
దేవరకొండ/ కొండమల్లేపల్లి/ మాల్ : దేవరకొండలో డీఎస్పీ ఆనందరెడ్డి గురువారం పట్టణంలోని ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు ఆపి వివరాలు తెలుసుకున్నారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు. అనుమతులు లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డీఎస్పీ వెంట సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ శ్రీను, సిబ్బంది ఉన్నారు. దేవరకొండ పట్టణంలో నిబంధనలు ఉల్లఘించిన ఆరుగురు కిరాణా షాపుల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉదయం 10గంటల్లోపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆ తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లకు చేరుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని సీఐ పరశురాం, ఎస్ఐ భాస్కర్రెడ్డి కోరారు. చింతపల్లి మండలం మాల్ పట్టణం గురువారం ఉదయం 6 గంటలకే పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారితో రద్దీగా కనిపించింది. కూరగాయలు, పండ్లు, నిత్యవసరాల దుకాణాల వద్ద జన సందోహం కనిపించింది. 10గంటల తరువాత షాపులన్నీ మూతపడ్డాయి. దీంతో అంతసేపు జనం రద్దీతో కళకళగా కనిపించిన పట్టణం ఒక్కసారిగా నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది.