వ్యాక్సిన్ వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం
120బెడ్లతో సిద్దిపేటలో కరోనా వార్డు
రెండు రోజుల్లో ఫస్ట్ డోస్ పూర్తి చేయాలి
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 23 : వ్యాక్సిన్ టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. టీకాపై నిర్లక్ష్యం తగదని మంత్రి హరీశ్రావు సూచించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడికక్కడే కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, డీఎంహెచ్వోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్, సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు, కొవిడ్ వార్డు ఇన్చార్జిలతో సమీక్షించారు.
రెండు రోజుల్లో ఫస్ట్ డోస్ పూర్తి చేయాలి..
సిద్దిపేట జిల్లాలో పోలీసులు, వైద్యులు, రెవెన్యూ, పారిశుధ్య కార్మిక సిబ్బందికి 96శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. మిగతా వారు కూడా ఈ రెండు రోజుల్లో ఫస్ట్ డోస్ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఫ్రంట్లైన్ వర్కర్లంతా మళ్లీ నూటికి నూరు శాతం రెండో డోస్ తీసుకోవాలన్నారు. 45 ఏండ్లు పైబడిన వారు జిల్లాలో లక్షా 60వేల మంది ఉండగా లక్షా 40వేల మంది టీకా వేసుకున్నారన్నారు. 20వేల మంది మిగిలారని, వీరితో పాటు 11వేల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా అవసరముందని డీఎంహెచ్వో తెలపడంతో మంత్రి హరీశ్రావు వెంటనే స్పందించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ సెక్రటరీ వాకాటి కరుణకు ఫోన్ చేసి 30వేల వ్యాక్సిన్లు కావాలని కోరగా.. ఆమె వెంటనే స్పందించారు. వ్యాక్సిన్ వినియోగంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, రెండో డోస్లో కూ డా అదే విధంగా టీకా తీసుకొని ప్రజలందరికీ రక్షణ కల్పించేలా ఫ్రంట్లైన్ వర్కర్లు కృషి చేయాలన్నారు.
120 బెడ్లతో కరోనా వార్డు ..
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల జనరల్ దవాఖానలో 120 బెడ్లతో కరోనా వార్డును ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇందులో 35 ఐసీయూ వెంటిలేటర్ల బెడ్లు, 65 ఆక్సిజన్ బెడ్లు, మరో 20 నాన్ ఆక్సిజన్ బెడ్లతో వార్డులు ఉన్నట్లు తెలిపారు. వైద్యుల కోరిక మేరకు మిట్టపల్లిలోని సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 120బెడ్లలో 83మంది కరోనా పేషెంట్లు ఉన్నారని, వీరిలో 12మంది ఐసీయూలో, మిగతా వారు ఆక్సిజన్ బెడ్లలో చికిత్స పొందుతున్నారన్నారు.
ముందుచూపుతో ఆక్సిజన్ ప్లాంట్లు ..
దేశమంతా ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతుంటే సిద్దిపేట దవాఖానలో మాత్రం ఆ పరిస్థితి లేదని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇక్కడ ముందుచూపుతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని, 13వేల లీటర్ల సామర్థ్యం గల ఇలాంటి ప్లాంట్ను మన రాష్ట్రంలోనే అతి పెద్దదని వివరించారు. ప్రతి రోజు 900 లీటర్ల ఆక్సిజన్ వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రెమ్డిసివిర్ ఇంజక్షన్ల కొరత లేదు..
కరోనా పేషెంట్లకు ప్రాథమిక దశలో ఇచ్చే రెమ్డిసివిర్ ఇంజక్షన్లకు సిద్దిపేట దవాఖానలో కొరత లేదని మంత్రి హరీశ్రావు చెప్పారు. ప్రస్తుతం 274 రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, మాస్క్లు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. దవాఖానలో సిబ్బంది 24 గంటల పాటు పనిచేస్తున్నారని, 8మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ మిగతా వారు మనోధైర్యంతో పనిచేయడం అభినందనీయమన్నారు. ఒక కొవిడ్ అంబులెన్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. దేశమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తుందని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
కరోనా పేషెంట్లను తిరస్కరించొద్దు..
ప్రభుత్వ దవాఖానకు వచ్చే కరోనా పేషెంట్లను తిరస్కరించొద్దని, వారిని అడ్మిట్ చేసుకోవాలని మంత్రి హరీశ్రావు వైద్యులకు సూచించారు. చాలా మంది ఇంట్లో నే హోం క్వారంటైన్ ఉంటున్నారని, ఎవరైన అత్యవస ర పరిస్థితుల్లో దవాఖానకు వస్తే ఆదరించాలన్నారు. క రోనా పేషెంట్లకు సేవలందించడంతో పాటు డయాగ్నోస్టిక్, సీటీ స్కాన్ సేవలు అందించాలని సూచించారు.