నెన్నెల, ఏప్రిల్ 26 : కోటి ఆశలతో మామిడి సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగిలింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి భారీగా తగ్గగా, ఉన్న కాస్త పంటనైనా అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో ధరలేక దిగాలుపడుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది దాదాపు 24 వేల హెక్టార్లలో మామిడి సాగయ్యింది.
ప్రస్తుతం కోతలు మొదలయ్యాయి. యేటా సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, ఈ యేడాది వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి భారీగా తగ్గే అవకాశముంది. పూత ఆలస్యంగా రావడంతో పాటు తెగుళ్లు సోకడం.. కొంతమేర కాత నిలిచినప్పటికీ గాలి వానలకు పంట నేల రాలిపోవడంవంటి కారణాలతో దిగుబడి తగ్గుతుందని, ఎకరానికి కనీసం టన్ను కాయ కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి మామిడి దిగుబడి తగ్గడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఆశించిన రైతులు, వ్యాపారులకు చివరకు నిరాశే మిగిలింది. ఇక్కడి రైతులు మాహారాష్ట్రలోని నాగపూర్ ఫ్రూట్ మార్కెట్కు తరలిస్తుంటారు. పంట కోసి వందల కిలో మీటర్లలో ఉన్న మార్కెట్కు తరలిస్తే.. అక్కడ దళారుల చేతుల్లో మోసపోవాల్సి వస్తున్నది. ఇక కొందరు వ్యాపారులైతే నేరుగా తోటల వద్దకే వచ్చి రైతులను మచ్చిక చేసుకొని తమ హడ్తి వద్దకు తీసుకురావాలని, మంచి ధర వస్తుందని నమ్మబలుకుతున్నారు. రైతుల ముందే ఫోన్లో మాట్లాడినట్లు నటించి.. ధర మంచిగుందని నమ్మిస్తున్నారు. తీరా దళారులను నమ్మి పంటను మార్కెట్కు తరలిస్తే క్వింటాలుకు రూ.4 వేల చొప్పున కూడా కొనడం లేదని రైతులు వాపోతున్నారు.
మొదట క్వింటాలుకు రూ.8 వేల వరకు ధర పలుకగా, ప్రస్తుతం కనిష్ఠంగా రూ. 3500 మాత్రమే ఉంది. పెట్టుబడి, కోత ఖర్చులు, ట్రాన్స్ఫోర్టు, టోల్ ఫీజు, దళారీ కమీషన్వంటివి పోగా.. ఏమీ మిగలడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఏప్రిల్ మొదటి వారంలోనే క్వింటాలుకు రూ.12 వేల ధర పలికిందని, చివరాఖరు వరకు రూ.5 వేల దాకా ధర ఉందని వారు పేర్కొంటున్నారు. ఇక మామిడిలో అధిక డిమాండ్ ఉంటుందనుకున్న దసేరికి కూడా ఈ సారి బంగెనపల్లి మామిడి కంటే తక్కువగా ధర పలుకుతుంది. దసేరికి కిలోకు రూ. 40 చొప్పున, బంగెనపల్లి రకానికి కిలోకు రూ.50 చొప్పున ధర పలుకుతుం ది. స్థానికంగా మార్కెట్ సదుపాయం కల్పిస్తే తమకు కొంత లాభముండేదని రైతులు పేర్కొంటున్నారు.
అంతంత మాత్రంగా కాసిన మామిడి పంట చేతికొస్తున్న తరుణంలో మబ్బులు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లకు మామిడి నేలరాలిన విషయం విదితమే.. ఉన్నకాస్త పంటనైనా అమ్ముకుందామనుకుంటే వానలు భయపెడుతున్నాయని వారు పేర్కొంటున్నారు.