పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపడుతున్నాం. పురాతన భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు, నిరుపయోగ బావులను పూడ్చివేయడం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా మారుస్తాం. పిచ్చి మొక్కలను తొలగించి రోడ్లను పరిశుభ్రంగా మార్చడం.. డ్రైనేజీలను క్లీన్ చేయడం.. మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడం.. తడి-పొడి చెత్తను వేరుగా సేకరించడం లాంటి పనులను అధికారులు చేపడుతారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో నాలాలను పరిశుభ్రంగా మారుస్తారు.
స్ఫూర్తిగా తీసుకొని..
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతినెల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతో గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మిస్తున్నాం. అయితే పల్లె ప్రగతిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నెలకు రూ.12.38 కోట్లు, పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలకు రూ.5.60 కోట్లు, వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు రూ.7.80 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.2.50 కోట్లను విడుదల చేస్తున్నాం. గతంలో చేసిన పల్లె, పట్టణ ప్రగతిలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాప్రతినిధులంతా పాల్గొని విజయవంతం చేయాలని సూచిస్తున్నాం.
ఈ సారి పట్టణాలు కూడా..
కరోనా దృష్ట్యా ఇప్పటి వరకు ఒకసారే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ సారి పల్లె ప్రగతి కంటే పట్టణ ప్రగతికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేయడంతో పాటు.. డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి ప్రతి మున్సిపాలిటీని స్వచ్ఛంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఒక రోజు..
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పెండింగ్ విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఒక రోజు కేటాయించాం. వంగిన స్తంభాలను సరి చేయడం.. వేలాడే వైర్లను తొలగిస్తాం. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న 10 శాతం విద్యుత్ సమస్యను పరిష్కరిస్తాం. అంతేకాక గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తాం.
ఇంటింటికీ మొక్కలు..
ఏడో విడత హరితహారం కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రంగారెడ్డి జిల్లాలోని 558, వికారాబాద్ జిల్లాలో 566 నర్సరీలతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచాం. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో హరితహారంలో భాగంగా 74 లక్షల మొక్కలను నాటనున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలకు కావాల్సిన మొక్కలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టాం. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాం.
16 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు..
జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే 16 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయ్యింది. ఈ మార్కెట్లలో వినియోగదారులకు వెజ్, నాన్-వెజ్, పండ్లు, కూరగాయలు, పూలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని 16 మున్సిపాలిటీలు, వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించ తలపెట్టాం.
557 గ్రామాల్లో కంపోస్ట్ షెడ్ల ఏర్పాటు పూర్తి..
జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలతో పాటు 309 హాబిటేషన్లలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. అంతేకాక ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్ అందజేసింది. ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని 557 గ్రామ పంచాయతీల్లో కంపోస్ట్ షెడ్లను ఇప్పటికే పూర్తి చేశాం. ఒక్కో దానికి రూ.6 లక్షలు ఖర్చు పెట్టాం. కంపోస్ట్ షెడ్లో ఎరువుల తయారీకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం.
“సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారింది. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల వారు వచ్చి అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. స్థానిక సంస్థలను బలోపేతం చేసి చూపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ చేతల్లో చూపుతున్నారు. స్వచ్ఛ భారత్ అంటూ ఊదరగొట్టకుండా ఓ విజన్తో పని చేసి తెలంగాణను స్వచ్ఛంగా మార్చి ఇతరులకు ఆదర్శంగా మారారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ప్రతి పల్లెలో ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు ఏర్పాటు అవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం చేయని పని ఇది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో అనేక సత్ఫలితాలు వచ్చాయి.” అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ఆమె ‘నమస్తేతెలంగాణ ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
నాలాల అభివృద్ధి పకడ్బందీగా..
గతేడాది కురిసిన భారీ వర్షాలతో శివారు ప్రాంతాలు జలమయమై స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్లో ముంపు సమస్య తలెత్తకుండా నాలాల అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలను రూపొందించాం. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తాం.
వైకుంఠధామాలన్నీ పూర్తి..
రెండు జిల్లాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 558, వికారాబాద్ జిల్లాలో 566 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు పూర్తి చేశాం. మున్సిపాలిటీల్లోనూ వైకుంఠధామాలు పూర్తయ్యాయి. పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.4 కోట్ల నిధులను మంజూరు అయ్యాయి.