బతుకమ్మలా పాటలు పేర్చిన కలం మూగవోయింది. జానపదంలో గానపథం వెదుక్కొన్న స్వరం ఆగిపోయింది సినీగేయ ఆకాశంలో రెక్క విప్పిన గువ్వ తిరిగిరాని గూటికి వెళ్లిపోయింది. మరపురాని తెరపాటలను అందించిన మువ్వ సవ్వడి నిలిచిపోయింది. ప్రఖ్యాత సినీ గేయరచయిత కందికొండ యాదగిరి శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కందికొండకు మెరుగైన వైద్యసహాయం అందించేందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా చొరవతీసుకొన్నారు. మెరుగైన వైద్యం అందినప్పటికీ కందికొండ కోలుకోలేదు. కందికొండ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, గవర్నర్, స్పీకర్, సినీ ప్రముఖులు, తెలంగాణ వాదులు సంతాపం తెలిపారు. కందికొండ పార్థివ దేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
నర్సంపేట రూరల్, మార్చి 12: ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో విషాదం నెలకొంది. రెండేళ్లుగా కందికొండ యాదగిరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా కీమోథెరపీతో వెన్నెముక దెబ్బతిన్నది. చివరకు ఆరోగ్యం విషమించి మృతిచెందారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు ప్రభంజన్, కూతురు మాతృక ఉన్నారు. కందికొండ యాదగిరి హైదారాబాద్లో మృతి చెందగా ఆయన మృతదేహాన్ని నాగుర్లపల్లి గ్రామానికి తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. కందికొండ మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వం
కేన్సర్తో పోరాటం చేసినా ఇతర అనారోగ్య సమస్యలు కందికొండను ఇబ్బంది పెట్టాయి. ఆయన ఆర్థిక పరిస్థితి తెసుకున్న తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి కేటీఆర్ కందికొండకు మెరుగైన చికిత్స అందించేలా ఆదేశించారు. చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కందికొండ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల చిత్రపరిశ్రమ, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.