రూ.2కోట్ల నిధులతో అభివృద్ధి
హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం
ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ
స్వచ్ఛతలో అగ్రగామిగా గ్రామం
ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 4 : పల్లె ప్రగతిలో భాగంగా పోల్కంపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.2 కోట్ల నిధులు కేటాయించింది. వీటితో గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు, వైకుంఠధామం, కంపోస్ట్ యార్డు, పల్లె ప్రకృతివనంతోపాటు వివిధ రకాల పనులు చేపట్టారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం, హరితహారం మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం వంటి పనులు చేపడుతున్నారు. గ్రామంలో ఏ వీధిలో చూసినా సీసీరోడ్లు కనిపిస్తున్నాయి.
సీమాంధ్ర పాలకుల హయాంలో పోల్కంపల్లి గ్రామం అభివృద్ధిలో వెలివేసినట్లుగా ఉండేది. ఎక్కడ చూసినా మురికి కాల్వలు, మట్టిరోడ్లు, రోడ్ల పక్కన పెంటకుప్పలతో దోమలు, ఈగల స్వైర విహారంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. కాని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. పోల్కంపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపాలన్న తపన, ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కృషితో సర్పంచ్ చెరుకూరి ఆండాళు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. రెండేండ్ల కాలంలో గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం, కమ్యూనిటీ భవనాలు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టు యార్డు, పల్లె ప్రకృతివనంతోపాటు పలు రకాల పనులకుగానూ సర్కారు నుంచి సుమారు రూ.2కోట్ల వరకు నిధులు కేటాయించారు. ప్రతిరోజూ గ్రామంలోని వీధులను శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, హరితహారం మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం వంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. గ్రామంలో ఏ వీధిలో చూసినా సీసీ రోడ్లు కనిపిస్తుంటాయి. ఇబ్రహీంపట్నం మండలంలో పోల్కంపల్లి గ్రామం స్వచ్ఛతకు కేరాఫ్గా మారిందని, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన వివిధ రకాల పనులను పరిశీలించేందుకుగానూ కేంద్ర బృందం నెల రోజుల క్రితం గ్రామంలో పర్యటించి పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పలు రకాల పనులను పరిశీలించి గ్రామాభివృద్ధికి కితాబిచ్చారు.
రూ.12లక్షలతో వైకుంఠధామం..
పోల్కంపల్లిలో గతంలో వైకుంఠధామం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. పల్లె ప్రగతిలో భాగంగా రూ.12లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. వైకుంఠధామంలో స్నానాల గదులు, ఇతరత్రా అన్ని సదుపాయాలను సమకూర్చారు. ఎరువు తయారీకి వర్మీ కంపోస్టు యార్డుగ్రామంలో సేకరించిన చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేయడం కోసం రూ.2.30లక్షలతో వర్మీ కంపోస్టు యార్డును నిర్మించారు. ప్రతిరోజూ గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి ఎరువు తయారీకి ఉపయోగిస్తున్నారు. ఆ ఎరువును హరితహారం మొక్కలకు అందజేస్తున్నారు.
చెత్త సేకరణకు, మొక్కలకు నీరు పోయడానికి ట్రాక్టర్..
గ్రామంలో చెత్త సేకరణతోపాటు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోయడం కోసం రూ.5.38లక్షలతో ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ఈ ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజూ ఉదయం గ్రామంలో చెత్తను సేకరించి వర్మీ కంపోస్టు యార్డుకు తరలిస్తారు. అనంతరం ట్యాంకర్ ద్వారా గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన చెట్లకు నీటిని అందజేస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణానికి పల్లె ప్రకృతి వనం..
గ్రామంలో రూ.2లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. వనంలో పలు రకాల మొక్కలు నాటి మొక్కలకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ నీటిని అందజేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో సుమారు 40 రకాల మొక్కలను పెంచడంతోపాటు వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి కృషితో ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నాం. గతంలో కంటే గ్రామం రెండేండ్ల కాలంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయించడంతో పాటు గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర మరువలేనిది.
పల్లె ప్రగతిలో గ్రామస్తుల పాత్ర కీలకం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో పోల్కంపల్లి గ్రామస్తుల పాత్ర మరిచిపోలేనిది. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపనతో ప్రతిఒక్కరూ కంకణబద్దులై పనిచేశారు. గ్రామంలో మొక్కల సంరక్షణతోపాటు పలు రకాల పనుల కోసం దాతల సహకారం ఎంతో ఉంది. గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలన్న సంకల్పంతో ముందుకు నడుస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో తాను ప్రత్యేకాధికారిగా పనిచేసిన పోల్కంపల్లి గ్రామాభివృద్ధికి ప్రజలు, అధికారులు మరింత సహకరించాలి.