నాయికగా తాను ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నానో మొదటి చిత్రం నుంచే అవగాహనతో ఉన్నానని చెబుతున్నది బాలీవుడ్ నాయిక యామీ గౌతమ్. ‘వికీ డోనర్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన యామీ…పలు విజయవంతమైన చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ఇటీవల ‘లాస్ట్’, ‘చోర్ నికల్కే భాగా’ వంటి ఓటీటీ చిత్రాలు చేసిన ఈ తార అక్షయ్ కుమార్తో కలిసి ‘ఓ మై గాడ్’ సీక్వెల్లో నటిస్తున్నది. తాజా ఇంటర్వ్యూలో యామీ మాట్లాడుతూ…‘చాలా మంది ఇండస్ట్రీలో ఒక్క హిట్ దక్కితే చాలు స్థిరపడిపోవచ్చు అనుకుంటారు. కానీ అసలు సవాలు ఆ విజయం తర్వాతే మొదలవుతుంది.
ఈ ద్వితీయ విఘ్నం దాటితే నటిగా మన ప్రాధామ్యాలు ఏమిటనేది పరిశ్రమకు, ప్రేక్షకులకు తెలుస్తుంది. అందుకే సినిమాల ఎంపికలో నేను జాగ్రత్త వహిస్తుంటా. నటించకుండా విరామం తీసుకున్నా ఫర్వాలేదు గానీ నచ్చని ప్రాజెక్ట్స్ చేయను. నా దగ్గరకు వచ్చిన ప్రతి కథను పూర్తిగా చదువుతా. అందులో నచ్చిన, నచ్చని అంశాలను నోట్ చేస్తుంటా. ఒక రచయిత ఎంతో ఆలోచించి ఆ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంటారు. స్క్రిప్ట్ చదవడం రచయితల కష్టానికి మనం ఇచ్చే కనీస గౌరవంగా భావిస్తా. ప్రతి ఒక్కరికీ జయాపజయాలు సహజం. కష్టం వచ్చినప్పుడే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాం. విజయానికి దగ్గరి దారులంటూ ఉండవు. నిత్యం శ్రమించి సాధించుకోవాల్సిందే’ అని చెప్పింది.