‘గదర్-2’ చిత్రంతో బాలీవుడ్లో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారు సీనియర్ హీరో సన్నీ డియోల్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్నీ డియోల్తో సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు.
‘గదర్-2’ విజయం దృష్ట్యా ఆయన పారితోషికాన్ని కూడా భారీగా పెంచారని అంటున్నారు. ఇదిలావుండగా రణ్బీర్కపూర్ రాముడి పాత్రధారిగా బాలీవుడ్లో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి సీత పాత్రను పోషించనుంది. అల్లు అరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తారు.
తాజాగా ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ నటించనున్నారని తెలిసింది. ఇప్పటికే చిత్ర దర్శకనిర్మాతలు ఆయనతో సంప్రదింపులు జరిపారని, హనుమాన్ పాత్రకున్న ప్రాశస్త్యం దృష్ట్యా సినిమాలో నటించడానికి సన్నీ డియోల్ అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం ఆయన దాదాపు 50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని తెలిసింది.