ముంబై : గదర్ 2తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించి సత్తా చాటిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఆరోపణలపై స్పందించారు. నెపోటిజం గురించి జనాలు ఎప్పుడూ మాట్లాడుతుంటారని, కానీ అసలు అదేంటని తాను ఆలోచిస్తుంటానని చెప్పుకొచ్చారు. అసలు తండ్రి తన బిడ్డలకు సపోర్ట్ చేయకుంటే ఎవరు చేస్తారని ప్రశ్నించారు.
నెపోటిజంపై ఏం మాట్లాడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని, ఇది అన్ని రంగాల్లో ఉందని వ్యాఖ్యానించారు. నటన కావచ్చు మరో కెరీర్ కావచ్చు తండ్రి తన బిడ్లల భవిష్యత్ను ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచిస్తాడని అన్నారు. ఏ విషయంలోనూ సక్సెస్ దక్కక నైరాశ్యంలో ఉన్నవారే ఎక్కువగా నెపోటిజం పదాన్ని వాడతారని, ఇందులో వారి తప్పు కూడా లేదని అన్నారు.
అసలు నెపోటిజం అనే పదానికి అర్ధం లేదని పేర్కొన్నారు. తన తండ్రి ధర్మేంద్ర కష్టపడి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారని, తాను, బాబీ, అభయ్ డియోల్లు ఎవరికి వారు తమదైన గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు తండ్రిగా ఉండటం అంటే ఏంటో తనకు తెలిసిందని, తన తండ్రి ఎలా ఫీలయ్యారో అర్ధమవుతోందని, తండ్రి భయాలు, ఇబ్బందులు ఏంటో తెలిసివస్తోందని, అయితే తన కుమారుడు రజ్వీర్ తనదైన ప్రయాణాన్ని సాగిస్తున్నాడని చెప్పారు. సన్నీ డియోల్ కుమారుడు రజ్వీర్ డోనో మూవీతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు నిరాశపరిచాయి.
Read More :
Afghanistan | వరుస భూకంపాలతో గజగజ వణికిన అప్గానిస్థాన్.. 2000 పెరిగిన మృతుల సంఖ్య