నల్లగొండ ప్రతినిధి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : కృష్ణానదిలో గత పది రోజులుగా కొనసాగుతున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్పై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే ఈ సారి సాగర్కు కూడా వరద రావచ్చని భావిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి మూడు రోజుల కిందట 1.55లక్షల క్యూసెక్కల వరద రావడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతూ వచ్చింది. అయితే గురువారం నాటికి ఇన్ఫ్లో 58,587 క్యూసెక్కులకు తగ్గినా వరద కొనసాగుతున్నది. దీంతో ఆల్మట్టిలో మరో ఏడున్నర అడుగుల మేర నీరు వచ్చి చేరితే పూర్తిస్థాయిలో నిండనున్నది. ఆ తర్వాత గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,816 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం గేట్ల మరమ్మతుల కారణంగా వారం రోజుల పాటు నీటిని రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వదిలేశారు. దీంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల ప్రాజెక్టుకు వరద వస్తుండడం ప్రభుత్వం అప్రమత్తమై ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేసింది. ఇదే సమయంలో నెట్టంపాడు, బీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా నీటిని రిజర్వాయర్లకు తరలిస్తుంది. జూరాలలో ప్రస్తుతం 1045 అడుగుల పూర్తి సామర్థ్యానికి గాను 1040 అడుగల వరకు నీరు వచ్చి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి మరో ఐదు అడుగుల దిగవనే నీటిమట్టం నమోదైంది. జూరాల పూర్తిస్థాయిలో నిండితే అక్కడి నుంచి నేరుగా కృష్ణమ్మ శ్రీశైలం రిజర్వాయర్ను తాకనున్నది.
సాగర్లో 532.90అడుగల నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎప్పుడు వరదనీరు మొదలైనా ఆ నీటిని ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నాగార్జునసాగర్కు తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. గత ఏడాది కూడా ఇదే విధంగా వచ్చినా వరద మొదలైన తొలినాళ్ల నుంచే ఆ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే సాగర్ రిజర్వాయర్కు విడుదల చేసింది. దీంతో శ్రీశైలంతోపాటు సాగర్లోనూ క్రమక్రమంగా నీటిమట్టం పెరిగింది. ఈ సారి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మొదలైతే వెంటనే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తద్వారా శ్రీశైలం పూర్తిగా నిండే వరకు ఆగాల్సిన పనిలేకుండా నీటిని సాగర్కు తరలించవచ్చు. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్లో 532.90అడుగల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 173.86టీఎంసీలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి. కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగున్నర టీఎంసీలు అధికంగానే ఉన్నట్లు లెక్క. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 885అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 816.70అడుగుల నీరు ఉన్నది. గత ఏడాది ఇదే రోజుకు 811 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇక 2019 సంవత్సరంలో జూన్ నెలతో పోలిస్తే అటు శ్రీశైలం, ఇటు సాగర్లోనూ నీటినిల్వ చాలా ఎక్కువగానే ఉన్నట్లు నీటిపారుదల శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఆనందంలో ఆయకట్టు రైతాంగం
కృష్ణానదిలో వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ముందస్తుగానే సాగునీరు విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద రెండు రాష్ర్టాల్లో కలిపి దాదాపు 11లక్షలకు సాగునీటిని విడుదల చేస్తుంటారు. గత ఏడాది కూడా రెండు పంటలకు పూర్తి స్తాయిలో నీటిని విడుదల చేశారు. అయినా సరే ఈ వేసవిలోనూ తాగునీటి అవసరాలతోపాటు చెరువులను నింపేందుకు కూడా కాల్వల్లో నిరంతరం నీటి విడదల కొనసాగింది. అయినా సాగర్లో ప్రస్తుతం 532.90 అడుగుల నీరు ఉండడం గమనార్హం. కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా దాదాపు 22.90 అడుగుల నీరు అదనంగానే ఉన్నది. ప్రస్తుతం ఈ నీటితో సమయం రాగానే నారుమళ్ల కోసం నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీశైలం నుంచి వచ్చే వరదనీటిని బట్టి ఆయకట్టుకు పూర్తి స్తాయి నీటి విడుదల జరుగనున్నది. ఈ ఏడాది కూడా పరిస్థితి పూర్తి ఆశాజనకంగా కనిపిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే సాగర్ నిండాలి, తమ పొలాలు పండాలని కోరుకుంటున్నారు. దీంతో ప్రస్తుత సీజన్లోనూ నాగార్జునసాగర్ ఆయకట్టులో సకాలంలోనే పంటలు సాగుకానున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఎగువన కూడా జూన్లోనే ఈ మాదిరి వరదలు గతంలో ఎన్నడూలేవని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జూలై మధ్య నాటికి వరదలు మొదలై చివరి వరకు శ్రీశైలం, ఆ తర్వాత సాగర్కు వరద నీరు వచ్చి చేరుతుంటుంది.