ఒకప్పుడు వెండితెరపై విలనిజం ప్రదర్శించి అభిమానుల మనసులు గెలుచుకున్న సోనూసూద్ ఇప్పుడు తను చేస్తున్న సేవా కార్యక్రమాల వలన రియల్ హీరోగా మారాడు. ఆయన చేస్తున్న సేవలకు బ్రేకే లేదు.కరోనా మొదలైనప్పటి నుండి సోనూ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తాడు నటుడు సోనూసూద్.
సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకి యువత ఫిదా అవుతున్నారు. ఆయనను కలిసేందుకు కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నారు. ఆ మధ్య వికారాబాద్ నుండి ఓ యువకుడు ముంబైకి వెళ్లి సోనూని కలిసాడు. సుమారు పది రోజుల్లో 700 కి.మీ. నడిచి ఎట్టకేలకు అభిమాన నటుడిని కలిశాడు. తనకోసం కాలినడకన వచ్చిన అభిమానిని చూసి చలించిన సోనూసూద్ అతడిని ఇంటికి ఆహ్వానించి కాసేపు మాట్లాడాడు.
ఇలా పలు ప్రాంతాల నుండి కొందరు పాదయాత్ర, మరి కొందరు సైకిల్ యాత్రలు చేసుకుంటూ సోనూ దగ్గరకు వెళుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామానికి చెందిన పడిదల సాంబయ్య అనే యువకుడు సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇంప్రెస్ అయి కాలి నడకన ముంబై చేరుకొని సోనూసూద్ని కలిసాడు. గత నెల 17న కాలినడకన ముంబైకి బయలుదేరిన ఆ వ్యక్తి దాదాపు 1,050 కిలోమీటర్లు నడిచి ముంబైలోని ఫిలింటవర్ వద్ద సోనూసూద్ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.