సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా డ్రగ్స్ వ్యవహారం ఎంత కలకలం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈడీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి 12 మందికి నోటీసులు పంపింది. ఇందులో భాగంగా పూరీ జగన్నాథ్ని విచారించింది. ఇక కొద్ది సేపటి క్రితం ఛార్మి హాజరైంది. మరోవైపు హీరోయిన్ సంజన, నటి రాగిణి ద్వివేది లాంటి వారు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి ఇటీవల బెయిలుపై బయటకు వచ్చారు.
రీసెంట్గా కన్నడ చిత్ర పరిశ్రమలో మోడల్ గా రాణిస్తున్న సోనియా అగర్వాల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమె అరెస్ట్ నాటకీయంగా జరిగింది. పోలీసులు సోనియా అగర్వాల్ ఇంటిని రైడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె బాత్రూం లో దాక్కుందట. పోలీసులు ఆమె ఇంటిని సోదా చేయగా డ్రగ్స్ బయట పడ్డట్లు తెలుస్తోంది. దీనితో ఆమెని అరెస్ట్ చేసి విచారించగా తనకు డ్రగ్స్ సరఫరా చేసే వారితో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించింది.
ఈ వ్యవహారంలో బలైంది మాత్రం 7/జి బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్. కొన్ని మీడియా సంస్థలు అత్యత్సాహంతో మోడల్ సోనియాకు బదులుగా సినీ నటి సోనియా అగర్వాల్ ఫోటోను ప్రచురించాయి. ఈ విషయం సోనియా వద్దకు చేరడంతో ఆమె ఆ వార్తలను కొట్టిపారేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని, అసలు పోలీసులు రైడ్ చేసింది తన ఇంట్లో కాదని, ఆ సమయంలో తాను కేరళలో షూటింగ్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తప్పుడు కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలు, వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.