భవిష్యత్తులో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెప్పింది శోభిత ధూళిపాళ. ‘గూఢచారి’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ అచ్చ తెలుగు సోయగం ప్రస్తుతం దక్షిణాదిన బిజీ తారగా మారింది. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకుడు. 26/11 దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.
జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక శోభిత ధూళిపాళ మాట్లాడుతూ “గూఢచారి’ చిత్రీకరణ సమయంలో సందీప్ఉన్నికృష్ణన్ జీవితం గురించి దర్శకుడు శశికిరణ్ నాతో చాలా విషయాల్ని పంచుకునేవారు. ఓ రకంగా ఈ కథకు నేను తొలి ప్రేక్షకురాలిని. ఈ సినిమాలో నేను ఆనాటి దాడి ఘటనలో బందీ అయిన ప్రమోద అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతూ భిన్న భావోద్వేగాలతో నా పాత్ర సాగుతుంది.
నా కెరీర్లో ఇప్పటి వరకు ఈ స్థాయి ఎమోషనల్ క్యారెక్టర్ను చేయలేదు. అడివి శేష్తో నటించిన రెండో చిత్రమిది. ఆయనకు నేను లక్కీఛార్మ్ అంటున్నారు. అలా అనుకుంటే మంచిదేగా (నవ్వుతూ). కన్నీళ్లు రావడానికి ఇప్పటివరకు నేను గ్లిజరిన్ వాడలేదు. ఈ కథలోని ఉద్వేగాల్ని అనుభవించిన తర్వాత ఇక సినిమా కోసం ఎప్పుడూ గ్లిజరిన్ వాడే అవసరం రాదనిపించింది’ అని పేర్కొంది.