“షరతులు వర్తిస్తాయి’ పోస్టర్స్, సాంగ్స్ చూపించారు. కంటెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంతో మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నా. ‘తురుమై వచ్చేయ్..’ అనే పాటను విడుదల చేశాను. పాట వినగానే నచ్చేలా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వంలో నాగార్జున సామల, శ్రీష్కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు చెందిన ‘తురుమై వచ్చేయ్..’ అనే పాటను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. పసునూరి రవీందర్ రాసిన ఈ గీతానికి అరుణ్ చిలువేరు స్వరపరచగా, ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే కేటీఆర్గారు మాకు టైమ్ ఇచ్చారు. ఇందులోని కీలకమైన గీతాన్ని ఆయన చేతులమీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కేటీఆర్గారికి థాంక్స్ చెబుతున్నా. సమస్యలకు భయపడకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని రగిలించేలా ఈ పాట రూపొందించాం’ అని దర్శకుడు చెప్పారు. నందకిశోర్, సంతోశ్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, శివకల్యాణ్, మల్లేశ్ బలాస్త్, సీతామహాలక్ష్మి, పెద్దింటి అశోక్కుమార్, సుజాత తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: పెద్దింటి అశోక్కుమార్, సంగీతం: అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి, కెమెరా: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి, నిర్మాణం: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్.