హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
వైభవంగా బీరప్ప-కామరాతి కల్యాణం
రామవరంలో కొనసాగుతున్న బీరప్ప పండుగ
అక్కన్నపేట, మార్చి 29: కురుమల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మండలంలోని రామవరంలో నాలుగు రోజులుగా జరుగుతున్న బీరప్ప పండుగలో భాగంగా సోమవారం బీరప్ప-కామరాతి కల్యాణ మహోత్సవానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ…కురుమ కులస్తులు నీతిమంతులన్నారు. కురుమలకు ఆర్థికంగా చేయూతనందించడంతో పాటు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందజేస్తోందన్నారు. మాజీ జడ్పీచైర్పర్సన్ ఉమ మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకోసారి గ్రామాల్లో బీరప్ప పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. గొల్లకుర్మల కుటుంబాల్లో బీరప్ప పండుగ అతి పెద్దగా చెప్పుకోవచ్చునన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే సతీశ్, తుల ఉమ బీరప్ప-కామరాతి కల్యాణం పూజల్లో పాల్గొన్నారు. బీరప్ప ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీశ్కుమార్తో పాటు తుల ఉమను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. పంథనికి చెందిన పొన్న రాజు బీర్ల బృందం బీరప్ప-కామరాతి కల్యాణం, పండుగ నిర్వహించగా, చంటయ్యపల్లికి చెందిన మంగ బీరన్న ఒగ్గు కళా బృందం చెప్పిన బీరప్ప కథ ఎంతగానో అకట్టుకుంది. ఈ వేడుకల్లో సుమారు 10 వేల మంది భక్తులు హాజరయ్యారు.
హాజరైన ప్రజాప్రతినిధులు
రామవరంలో జరుగుతున్న బీరప్ప పండుగలో భాగంగా బీరప్ప-కామరాతి కల్యాణానికి అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల లలిత, వైస్ ఎంపీపీ మజ్జిక మొగిలి, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిర్ర శ్రీకాంత్, కేవైసీఎస్ జిల్లా అధ్యక్షుడు గౌడ రాజుకుమార్, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాక నారాయణ, సర్పంచ్ వనపర్తి స్వప్న, ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న, బీరప్ప కమిటీ అధ్యక్షుడు బొమ్మ శ్రీశైలం, పెద్దకుర్మలు, కమిటీ సభ్యులు, పలువురు కురుమ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.