Congress Govt | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి మరో యూటర్న్ తీసుకున్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగిన అనంతరం ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్ ధరలు పెంచబోం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించి నెల రోజులు కూడా గడవకముందే ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. రామ్చరణ్ హీరోగా, దిల్రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు, టిక్కెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్షోలు ప్రదర్శించేందుకు, ఆ రోజు 6 షోలు, 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అ నుమతి ఇచ్చారు. అంతేకాదు, 10న అదనంగా మల్టీప్లెక్స్లో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.100, 11-19 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.50 టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం రేవంత్, మం త్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ప్రతిజ్ఞలు, ఇచ్చిన ప్రకటనలు వట్టి బూటకమేనా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అసెంబ్లీలో సీఎం మాటకు ఉన్న విలువ ఇదేనా?’ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి ‘ఎక్స్’లో ప్రశ్నించారు. ఇది క్విడ్ప్రో కో కాదా? అని నిలదీశారు. ఆ సిని మా నిర్మాత దిల్రాజు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారని, ఆయనకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం జీవోలు ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్నించారు.