‘వంశీ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. అతన్నుంచి ఇలాంటి కోణాన్ని ఊహించలేదు. ఎంత అద్భుతంగా చెప్పాడో, అంతకంటే అద్భుతంగా తీశాడు’ అని రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. రేణూదేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడారు. ‘అబ్బురపరిచే సాంకేతికతో రూపొందిన సినిమా ఇది. ప్రతి బ్లాకూ వండర్ అనేలా ఉంటుంది. రియల్ లొకేషన్లో సినిమా తీయడం వల్ల ఎమోషన్స్ కూడా బాగా క్యారీ అయ్యాయి. అన్ని వర్గాలకూ నచ్చే సినిమా అవుతుంది’ అని రవితేజ నమ్మకం వ్యక్తం చేశారు. ‘ఈ సినిమాతో మాది నాలుగేళ్ల ప్రయాణం. ఈ నెల 20న విడుదలవుతున్నది. ఏమాత్రం ఒత్తిడి లేదు. ఎందుకంటే సినిమా చూశాను. అందరూ ఊహించినదానికి మించి ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘టైగర్ నాగేశ్వరరావు’ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని దర్శకుడు వంశీ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు రచయిత విజయేంద్రప్రసాద్, హరీశ్ శంకర్, మలినేని గోపీచంద్, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, మిరియాల రవీందర్రెడ్డి మాట్లాడారు.