కన్నడ సోయగం రష్మిక మందన్న తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘యానిమల్’ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుత అభినయంతో మరింత పేరు సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఫోర్బ్స్ ఇండియా అండర్ 30’ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న 30 ఏళ్ల లోపు ప్రతిభావంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేయగా..అందులో రష్మిక మందన్న అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేసింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ ‘పుష్ప-2’ షూటింగ్లో పాల్గొంటున్నది. ధనుష్-నాగార్జున మల్టీస్టారర్లో కూడా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నది.