సాంకేతికతను మంచి కోసం వాడితే అది సమాజానికి ఉపయుక్తమవుతుంది. లేకపోతే అవాంఛిత పర్యవసానాలకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి, ముఖాలను మార్చేసి అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టే ధోరణి ఎక్కువైంది. హావభావాలు సైతం అచ్చుగుద్దినట్టు ఉండటంతో కొన్ని వీడియోలు షాక్కు గురి చేస్తున్నాయి. తాజాగా డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన వీడియోకు రష్మిక మందన్నా బాధితురాలిగా మారింది. జరా పటేల్ అనే మహిళ ముఖాన్ని రష్మిక మందన్న ముఖంలా మార్చేసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
అది విపరీతంగా వైరల్ అయింది. చివరకు బిగ్బీ అమితాబ్ బచ్చన్ సైతం ఈ వీడియోపై స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తన ఇన్స్టా ద్వారా ఈ వీడియోపై రష్మిక స్పందించింది. ‘ఇలాంటి విషయాలను పంచుకోవడం చాలా బాధగా ఉంది. ఈ సమయంలో నాపై గౌరవంతో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు.
మానసికంగా ఎదిగిన స్త్రీని కనుక ఈ పరిస్థితిని ఫేస్ చేయగలిగాను. అదే నేను చదువుకునే రోజుల్లో ఇలాంటివి సంభవిస్తే, ఎలా తట్టుకునేదాన్నో అని ఊహిస్తేనే భయంగా ఉంది. స్త్రీలకు ఈ టెక్నాలజీ ఒక శాపం. ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని చెప్పింది రష్మిక.
ఇదిలావుంటే.. ఈ సంఘటనపై కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించింది. ‘మార్ఫింగ్ అత్యంత ప్రమాదకరమైన చర్య. దీన్ని పరిష్కరించాల్సింది కూడా సామాజిక మాధ్యమాలే. కొత్త నిబంధనల ప్రకారం ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను గుర్తిస్తే, వాటిని 36 గంటల్లో తొలగించాలి. ఈ నిబంధన పాటించని వారు శిక్షార్హులు. ఈ నేరం చేసిన దోషుల్నీ, సదరు సామాజిక మాధ్యమాలను రూల్ 7 కింద కోర్టుకు లాగొచ్చు. ఈ వ్యవహా రంపై కేంద్ర సీరియస్గా ఉంది’ అని తెలియజేశారు.