‘నేను ప్రతీ సినిమాలో పాత్రలపరంగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఆడియెన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. గొప్ప బాధ్యతతో ఈ చిత్రాన్ని పూర్తి చేశా’ అని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన హిందీ హారర్ కామెడీ చిత్రం ‘థామా’ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆదిత్యా సర్పోత్థార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రష్మిక మందన్న మాట్లాడుతూ పైవిధంగా స్పందించింది.
ఆద్యంతం ఉత్కంఠను కలిగించే కథతో ఈ సినిమాను తెరకెక్కించారని, సరికొత్త కాన్సెప్ట్తో రూపొందిన ఈ కథ అందరికి నచ్చుతుందని రష్మిక మందన్న పేర్కొంది. ఫిలిం ప్రమోషన్ కోసం హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి అని, తాను ప్రతీ సినిమాకు కొత్త కాన్సెప్ట్ను ఎంచుకుంటానని, ‘థామా’ ఇప్పటివరకూ రాని భిన్నమైన కథతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని హీరో ఆయుష్మాన్ ఖురానా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.