ప్రస్తుత కథానాయికల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ భాషలకు అతీతంగా అభిమానాన్ని గెలుచుకుంటూ దూసుకుపోతున్నది రష్మిక. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆమెను ముద్దుగా పిలుచుకునే పేరు ‘నేషనల్ క్రష్’. దటీజ్ రష్మిక. రీసెంట్గా పాల్గొన్న ఓ సమావేశంలో తాను ఫేస్ చేసిన డీప్ ఫేక్ వీడియో గురించీ, సెలబ్రిటీలకే కాకుండా, వేలాదిమంది స్త్రీలకు పరువునష్టంగా తయారైన ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి విలువైన విషయాలు మాట్లాడింది రష్మిక.
‘మన బాధ ప్రపంచానికి తెలిసినప్పుడే భరోసా మనకు దక్కేది. కొందరి దుశ్చర్యల వల్ల మన క్యారెక్టర్ ప్రశ్నార్థకంగా మారినప్పుడు, మనం మౌనం వహించడం అంటే అది ఆత్మహత్యాసదృశ్యం. ప్రశ్నించాలి.. ప్రతిఘటించాలి.. అప్పుడే మనకు ప్రపంచం మద్దతుగా నిలుస్తుంది. నాకు అమితాబ్సార్ నుంచి చాలామంది పరిశ్రమ పెద్దల సపోర్ట్ లభించడానికి కారణం అదే. దురదృష్టవశత్తూ ప్రస్తుతం ఫేక్ వీడియోలు రావడం కామన్ అయిపోయింది. మిమ్మల్ని బాధించే సంఘటన ఏదైనా సంభవించినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. మనం గొప్ప దేశంలో ఉన్నాం. మన దేశమే మనకు అండ.’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.