Rangasthalam | రామ్చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ (2018) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. గ్రామీణ నేపథ్యంలో రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రామ్చరణ్ కెరీర్ను మలుపు తిప్పింది. చిట్టిబాబు పాత్రలో ఆయన అభినయం అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న జపాన్లో విడుదల చేశారు. ‘కేజీఎఫ్’ సిరీస్ రెండు చిత్రాలు కూడా ఇదే రోజు అక్కడ రిలీజ్ అయ్యాయి.
అయితే ‘రంగస్థలం’ చిత్రం తొలిరోజు 2.5 మిలియన్ యన్ (దాదాపు 14లక్షల రూపాయలు) వసూళ్లను సాధించింది. జపాన్లో విడుదలైన భారతీయ చిత్రాల తొలిరోజు వసూళ్లలో ఇదే అత్యధికమని అక్కడి ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. గత ఏడాది జపాన్లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును కూడా ‘రంగస్థలం’ బ్రేక్ చేయడం విశేషం. “రంగస్థలం’ చిత్రాన్ని 50 స్క్రీన్స్లో విడుదల చేశాం. రాబోవు రోజుల్లో థియేటర్ల సంఖ్య పెంచబోతున్నాం. జపాన్ ప్రేక్షకులు రామ్చరణ్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. సినిమాకు లభిస్తున్న వసూళ్లే అందుకు సాక్ష్యం’ అని జపాన్ డిస్ట్రిబ్యూటర్ అన్బరాసీ దురైపాండియన్ వెల్లడించారు.