సమకాలీన చిత్రసీమలో సృజనాత్మకంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. కథల ఎంపిక మొదలుకొని, సినిమాను ప్రజలకు చేరువ చేసే విధానంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘గతంలో సీనియర్ హీరోలతో జతకట్టిన కథానాయికల్ని జూనియర్ హీరోల సరసన తీసుకునే వారు కాదు. ఇమేజ్పరమైన ఇబ్బందులు వస్తాయనే భయం ఉండేది. ప్రస్తుతం అలాంటి అలోచనావిధానం మారిపోయింది. ఇమేజ్ పట్టింపులు పక్కనబెట్టి కథకు సరిపోయే తారల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే ప్రపంచ సినిమా ప్రభావంతో విభిన్న కథావస్తువుల్ని సృజిస్తున్నారు’ అని చెప్పింది. తన తాజా చిత్రం ‘కొండపొలం’లో పల్లెటూరి అమ్మాయిగా నటించానని, ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్కు అద్భుతమైన స్పందన లభిస్తోందని రకుల్ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన హృదయంలో స్వచ్ఛత ఉంటే అది తెరపై కనిపిస్తుంది. ‘కొండపొలం’ సినిమాలోని గ్రామీణ అమ్మాయి పాత్రను ఎంతగానో ప్రేమించాను. పాత్రపట్ల నా ప్రేమే తెర మీద కనిపించింది’ అని రకుల్ప్రీత్సింగ్ తెలిపింది.