కోవిడ్ కారణంగా ఎన్నో కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయి. ఎన్నో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనతో కలిసే ఉన్న వాళ్లు ఉన్నఫలంగా శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతున్నారు. అంతటి ఆరని విషాదాన్ని నింపుతుంది కరోనా వైరస్. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇండస్ట్రీలోనూ చాలా మంది చనిపోయారు. ఈ మధ్యే కొందరు దర్శకులు.. నిర్మాతలు.. టిఎన్ఆర్ లాంటి నటులు కూడా కన్నుమూసారు. ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖుల ఇళ్ళలో కూడా వైరస్ తీరని శోకం నింపుతుంది. మొన్నామధ్య సీనియర్ నటి ప్రభ సోదరుడు, ఎడిటర్ ప్రసాద్ కన్నుమూసారు. దానికి ముందు పియా బాజ్పెయీ అన్నయ్య కూడా కరోనాతోనే పోయారు.
తాజాగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయమైన పాయల్ తెలుగులో అరడజన్ సినిమాలకు పైగానే నటించింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ‘RDX లవ్’ తో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకుంది. సీనియర్ హీరోలు రవితేజ, వెంకటేష్ లాంటి హీరోలతో ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటించింది. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమాలో ఈమె ఐటం సాంగ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు లోక నాయకుడు కమల్ హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2లోనూ స్పెషల్ సాంగ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఈమె పర్సనల్ లైఫ్ లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కరోనా కారణంగా కోల్పోయింది. తాను ఎంతగానో లవ్ చేసే అనితా ఆంటీ కరోనా సోకి మృతి చెందినట్లు తెలిపింది. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు.. కానీ నా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని.. ఎన్నేళ్లైనా మిమ్మల్ని మరిచిపోయేది లేదంటూ ఎమోషనల్ అయింది పాయల్ రాజ్పుత్. మీ కుటుంబ సభ్యులకు మీరే ధైర్యం చెప్పాలంటూ అభిమానులు ఈమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.