లక్నో : గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రామాయణాన్ని వక్రీకరిస్తూ, దర్శకుడు ఓం రౌత్ ఇష్టారీతిన దృశ్యకావ్యంలో మార్పులు చేస్తూ ఆదిపురుష్ను తెరకెక్కించారనే విమర్శలు వెల్లువెత్తాయి. వారణాసిలో ఆదిపురుష్ సినిమా పోస్టర్లను కొందరు చించివేశారు.
చిత్ర దర్శక నిర్మాతలపై హిందూ మహాసభ సోమవారం లక్నో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చవకబారు డైలాగ్లతో అజెండాలో భాగంగా ఆదిపురుష్ మూవీని ముందుకు తెచ్చారని, ఇది ప్రజల మనోభావాలను గాయపరుస్తోందని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది. కొన్ని క్యారెక్టర్లను వివాదాస్పదంగా చిత్రీకరించడంతో పాటు అసంబద్ధ డైలాగులను చొప్పించారని నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సినిమా పోస్టర్లను చించివేసిన హిందూ సంఘాల కార్యకర్తలు ఆదిపురుష్ను చూడవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఓ ఆలయంలో సమావేశమైన కార్యకర్తలు సిగ్రా ప్రాంతంలోని మాల్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లక్నోలో హిందూ మహాసభ కార్యవర్గ సభ్యులు హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో చిత్ర నటీనటులతో పాటు దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేశారు.
Read More :
Manipur Violence | మణిపూర్లో ఆగని హింస.. ఇండ్లకు నిప్పు..! కాల్పుల్లో గాయపడ్డ జవాన్..!