చార్మినార్, జూలై 11: పాత కక్షలతో మూడు రోజుల కిందట కాలాపత్తర్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులోని నిందితులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ సుదర్శన్ కథనం ప్రకారం.., చున్నే కి బట్టి ప్రాంతానికి చెందిన సయ్యద్ అజం అలీ కుమారుడు సయ్యద్ ముఖ్రం అలీ (44) ట్రాన్స్పోర్ట్ వ్యాపారి. కాలాపత్తర్ మిశ్రీగంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హమీద్ఖాన్ (60) వృత్తిరీత్యా టైలర్. హమీద్ కుమారుడు అర్బాజ్ఖాన్ (20) కొంతకాలంగా సయ్యద్ ముఖ్రం అలీ కుమార్తెతో సన్నిహితంగా మసులుతూ ప్రేమిస్తున్నానంటూ తెలియజేశాడు.
కాగా, 2017లో సయ్యద్ ముఖ్రం అలీ తన కుమార్తెను అర్భాజ్ఖాన్ కిడ్నాప్ చేశాడని కాలాపత్తర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైరం మొదలైంది. కాలాపత్తర్ పోలీస్స్టేషన్లో నమోదైన కిడ్నాప్ కేసును వెనక్కు తీసుకోవాలని కోరుతూ మహ్మద్ హమీద్ఖాన్, అర్బాన్ ఖాన్ పలుమార్లు ముఖ్రం అలీని కోరారు. ఫిర్యాదుపై ఎలాంటి స్పందన వెలిబుచ్చని ముఖ్రం అలీపై నిందితులు కక్ష పెంచుకున్నారు. గురువారం రాత్రి పోలీస్స్టేషన్ పరిధిలో ఒంటరిగా ఉన్న ముఖ్రం అలీపై నిందితులు కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ముఖ్రం అలీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా లభించిన ఆధారాలతో నిందితులను అదివారం అదుపులోకి తీసుకుని విచారించారు. కక్షతోనే ముఖ్రం అలీని హతమార్చినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.