Nayanthara | కేరళ రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వయనాడ్ విలయంపై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దంపతులు ముందుకొచ్చారు. తమ వంతు సాయంగా రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందించారు. అదేవిధంగా వయనాడ్లోని ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ‘వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన విషాదకర ఘటన మా హృదయాలను కలిచివేసింది. సమాజం అనుభవిస్తున్న విధ్వంసం, నష్టాలు దయనీయంగా ఉన్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లో ఒకరికొకరు ఆదుకోవడం చాలా ముఖ్యం. అందుకే బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20లక్షలు అందిస్తున్నాము’ అని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీ టీమ్ కూడా రూ.5 లక్షలు సాయం ప్రకటించింది. కాగా, ఇప్పటికే పలువురు స్టార్స్ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలు విరాళంగా అందించారు.
Also Read..
Kullu-Manali Highway: క్లౌడ్బస్ట్తో కొట్టుకుపోయిన కులు-మనాలీ రోడ్డు.. వీడియో