ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు పంపించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగానే న్యూజిలాండ్ ప్లేయర్లు తమ దేశానికి వెళ్లనున్నారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొన్న న్యూజిలాండ్ టెస్టు టీమ్ క్రికెటర్లు మే 11న నేరుగా ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లనున్నారు. మిగతా ఆటగాళ్లు శుక్రవారం స్వదేశానికి వెళ్తారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ డేవిడ్ వైట్ తెలిపారు.
కివీస్ కెప్టెన్ విలియమ్సన్, కైల్ జేమిసన్, మిచెల్ సాంట్నర్తో పాటు ఫిజియో టామీ సిమ్సెక్ కొన్ని రోజులు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సురక్షితమైన మినీ బబుల్లో ఉంటారని బోర్డు వెల్లడించింది.
ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన కుటుంబ సభ్యులను కలిసేందుకు చార్టెర్డ్ ఫ్లైట్లో న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. జూన్ మొదటి వారంలో మిగతా కివీస్ ఆటగాళ్లతో కలిసి ఇంగ్లాండ్ చేరుకుంటాడు.