‘నటుడిగా ఎలాంటి ఇమేజ్ను కోరుకోవడం లేదు. మంచి సినిమాల్లో భాగం కావాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం ఓటీటీతో పాటు వరుస సినిమా అవకాశాలతో కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్నది’ అని అన్నారు యువ హీరో నవీన్చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా నవీన్చంద్ర మాట్లాడుతూ ‘నక్సలిజం నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథా చితమిది. దర్శకుడు వేణు ఊడుగుల చక్కటి కవితాత్మక భావనలతో కథను రాసుకున్నారు. ఈ సినిమాలో నక్సలిజం ఒక్కటే ప్రధానాంశం కాదు. హృదయాన్ని తడిమే భావోద్వేగాలు, అనేక మలుపులతో సినిమా ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో నేను రానా అనుచరుడు రఘన్న అనే నక్సలైట్ పాత్రలో కనిపిస్తా. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే వ్యక్తిగా నా పాత్ర ధైర్యం మూర్తీభవించి ఉంటుంది. ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడటం గొప్ప అనుభూతినిచ్చింది.
దర్శకుడు వేణు సలహాలతో తెలంగాణ యాసపై సాధన చేశాను. సినిమాలోని ప్రధాన భాగాన్ని మొత్తం దట్టమైన అడవుల్లో చిత్రీకరించారు. మా యూనిట్ మొత్తం కొండలు, గుట్టలు ఎక్కుతూ లొకేషన్కు చేరుకునేవాళ్లం. చివరి అర్ధగంటలో వచ్చే ఒక ఎపిసోడ్లో రఘన్న సంధించే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తించేలా ఉంటాయి. ప్రస్తుతం నాకు ఓటీటీతో పాటు సినిమాల్లో మంచి అవకాశాలొస్తున్నాయి. నటుడిగా పరిణితి చెందుతున్నా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నా’ అన్నారు.