హాలియా, జూలై 11 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పత్తిసాగు జోరందుకుంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆయకట్టేతర రైతులు విత్తనాలు విత్తుతున్నారు. హాలియా వ్యవసాయ డివిజన్లో ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో పత్తిసాగు అంచనా వేయగా.. ఇప్పటికే 75శాతం మంది రైతులు విత్తనాలు విత్తారు. మరో వారం రోజుల్లో పత్తిసాగు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జోరుగా పత్తిసాగు
నియోజకవర్గంలోని అనుముల, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, తిరుమలగిరి (సాగర్) మండలాల్లో రైతులు ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో పత్తిసాగు చేశారు. చాలా మంది రైతులు జూన్ మొదటి వారంలో కురిసిన తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని పత్తిని సాగు చేశారు. అనుముల మండలంలో 12వేల ఎకరాలు, నిడమనూరులో 5వేలు, త్రిపురారంలో 9 వేలు, తిరుమలగిరి (సాగర్)లో వెయ్యి, పెద్దవూరలో 32 వేలు, గుర్రంపోడు మండలంలో 36 వేల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు వేశారు.
వాతావరణం అనుకూలం
వారం రోజులుగా అడపా, దడపా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే దుక్కి దున్నుకున్న రైతులు పత్తి విత్తనాలు విత్తుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటి వరకు విత్తనాలు వేయని రైతులు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఇక పత్తి మొలకలు వచ్చిన వారి చెలకల్లో కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది కూడా సుమారు 1.5 లక్షల ఎకరాల్లో పత్తిసాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తికి మేలు చేసిన వర్షం
చందంపేట : మండలంలోని పలు గ్రామాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం పత్తిచేలకు మేలు చేసింది. మోస్తరు వర్షానికి పత్తి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో పొలాల్లో మొలిచిన కలుపు మొక్కలను ఏరే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. చిత్రియాల, పెద్దమూల, కాట్రావత్ తండా, గాగిళ్లాపురం గ్రామాల్లో రైతులు వ్యవసాయ పననుల్లో బిజీగా ఉన్నారు.
పత్తి సాగుపై రైతుల ఆసక్తి
సాగర్ నియోజకవర్గంలో చాలా మంది రైతులు పత్తిసాగుకు ఆసక్తి చూపుతున్నారు. కాల్వ కింది రైతులు వరి సాగు చేస్తుండగా.. మిగతా వారు పత్తిని వేస్తున్నారు. దిగుబడి బాగా వస్తుండడం, మద్దతు ధర కూడా లభిస్తుండడంతో రైతులు దీనివైపే మొగ్గు చూపుతున్నారు. పత్తిసాగు అంచనాలో 90 శాతం విత్తనాలు విత్తారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విత్తే అవకాశం ఉంది.
-జగదీశ్వర్రెడ్డి, ఏడీఏ, హాలియా