న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా.. తాలిబన్లపై చేసిన కామెంట్స్ ఇండియాలోని కొందరు ముస్లింలకు ఆగ్రహం తెప్పించింది. ఆ దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని ఇండియాలోని కొందరు ముస్లింలు సెలబ్రేట్ చేసుకున్నారని ఓ వీడియోలో నసీరుద్దీన్ అన్నాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో అతన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పలువురు ముస్లింలు పోస్ట్లు చేశారు. అదే సమయంలో బీజేపీ మాత్రం నసీరుద్దీన్ కామెంట్స్ను సమర్థించింది. దేశంలోని ముస్లింలు నసీరుద్దీన్లాగే తాలిబన్లకు వ్యతిరేకంగా మాట్లాడాలని అభిప్రాయపడింది.
తాలిబన్ల విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ముస్లింలు.. వాళ్లకు సంస్కరణలకు గురైన ఆధునిక ఇస్లాం కావాలో లేక ఒకప్పటి అనాగకరిక ఇస్లాం కావాలో తేల్చుకోవాలని నసీరుద్దీన్ అన్నాడు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇండియన్ ఇస్లాం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉన్నదని అతను అభిప్రాయపడ్డాడు. అయితే నసీరుద్దీన్ కామెంట్స్ను తప్పుబడుతూ పలువురు జర్నలిస్ట్లతోపాటు ఇతర ముస్లింలు తప్పుబట్టారు.