సరళమైన భాషలో అర్థవంతమైన సాహిత్యంతో గీత రచన చేస్తూ తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు పాటల రచయిత కృష్ణకాంత్. సమకాలీన తెలుగు చిత్రసీమలో మెలోడీ గీతాలకు ఆయన్ని కేరాఫ్ అడ్రస్గా చెబుతారు. నేడు కృష్ణకాంత్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. “నేను కెరీర్లో ఎక్కువగా మెలోడీ గీతాలే రాశాను. అవే నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గత ఏడాది సలార్, విరూపాక్ష, హాయ్ నాన్న, కోట బొమ్మాళి, జైలర్, జవాన్, లియో, చిన్నా వంటి చిత్రాలకు రాసిన పాటలు మంచి సంతృప్తినిచ్చాయి.
దాదాపు 70 పాటల వరకు రాశాను. త్వరలో విడుదల కాబోతున్న హను-మాన్, సైంధవ్, ఈగల్ చిత్రాలకు పాటలు రాశాను. ప్రభాస్-మారుతి కాంబినేషన్ చిత్రానికి కూడా పాటలు రాస్తున్నా. సినిమా కథను ఆవిష్కరించడంలో పాట కూడా ఓ సాధనంలా పనిచేస్తుంది. నా దృష్టిలో మంచి పాట..సినిమా కథేమిటో చెబుతుంది. అసభ్య, ద్వంద్వార్థాలతో కూడిన పాటలను నేను అస్సలు రాయను. కమర్షియల్ గీతాలు ఆ టైమ్ వరకే పాపులర్ అవుతాయి. కానీ అర్థవంతమైన మెలోడీ గీతాలు కలకాలం నిలిచిపోతాయి. పాటలతో పాటు ఇప్పటికే కొన్ని చిత్రాలకు మాటలు కూడా రాశాను. భవిష్యత్తులో పాటల, మాటల రచయితగా ప్రయాణం కొనసాగిద్దామనుకుంటున్నా’ అని చెప్పారు.