బాలకృష్ణ నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా చిత్ర సంగీత విశేషాలు తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఆయన మాట్లాడుతూ…‘ఈ ఏడాదిని వీరసింహా రెడ్డి లాంటి ఓ బిగ్ మూవీతో ప్రారంభించడం సంతోషంగా ఉంది.
ఇది బాలకృష్ణ గారి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఆయనకు మాస్, ఫ్యామిలీ ఫాలోయింగ్ ఎంత ఉందో ఈ సినిమా ఫలితం నిరూపిస్తుందని నా నమ్మకం. ఈ చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ అభిమానిగా ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ అదిరిపోయేలా రూపొందించాడు. పర్పెక్ట్గా క్యారెక్టర్లను మలచడంతో పాటు పాటలకూ ఈ చిత్రంలో మంచి స్థానం ఉంటుంది. అఖండతో ఈ సినిమాకు పోలిక లేదు.
మంచి కథలున్న చిత్రాలకే మంచి సంగీతాన్ని ఇవ్వగలం. అలా ఈ చిత్రానికి సంగీతం బాగుందంటే ఆ క్రెడిట్ మొదట దర్శకుడికే ఇవ్వాలి. పాటల విషయంలో ఒత్తిడికి లోనుకాను. సినిమా కోరుకునేది ఇవ్వడమే సంగీత దర్శకుడిగా నా పని. ఈ చిత్రంలో మాస్ మొగుడు, సుగుణ సుందరి, జై బాలయ్య వంటి పాటలు బాగా కుదిరాయి. నేపథ్య సంగీతం సన్నివేశాల ఫీల్ను మరింత పెంచుతుంది. కథతో పాటే ఈ పాటలూ ట్రావెల్ అవుతాయి. ద్వితీయార్థంలో వచ్చే నాలుగు ఫైట్స్, నాలుగు పాటలు మెప్పిస్తాయి. ఏ రంగంలోనైనా పోటీ ఉండాలి. సంగీతంలోనూ అంతే.
ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్ బయటకు వస్తుంది. మా చిత్రంతో పాటు సంక్రాంతికి రిలీజవుతున్న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమా కూడా విజయం సాధించాలి. ప్రస్తుతం రామ్ చరణ్తో పనిచేస్తున్న ఆర్సీ 15 పాటల కంపోజింగ్ పూర్తయింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి’ అన్నారు.