బంజారాహిల్స్, ఆగస్టు 8: తెలుగు సినీ పరిశ్రమలోకి తాను అడుగుపెట్టి 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 40దేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రకటించారు. జూబ్లీహిల్స్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40ఏళ్లపాటు కొనసాగడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని, ఈ సందర్భాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చుకునేందుకు 40దేశాల్లో సంగీ విభావరి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నామన్నారు.
40మంది వాయిద్య బృందంతో పాటు 40మంది గాయకులు, 40 పాటలను పాడి ఆయా దేశాల్లోని అభిమానులను అలరించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 40దేశాలలో నిర్వహించబోయే సంగీత విభావరికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాన్ని ఈనెల 13న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో అట్టహాసంగా నిర్వహించనున్నామని.
ఈ కార్యక్రమానికి 50దేశాలకు చెందిన తెలుగు సంఘాల ప్రతినిధులు అతిథులుగా విచ్చేయనున్నారని వెల్లడించారు. చిత్రపరిశ్రమలోని అనేకమంది ప్రముఖులు, గాయకులు ఈ సన్నాహక కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి ఆర్.మాధవరావు, ఐజీపీఎల్ ఫౌండర్ , నిర్మాత గంధం శ్యాంబాబు, రాజు ఎంటర్టైన్మెంట్ అధినేత మునుకోటి రాజు తదితరులు పాల్గొని బ్రోచర్లను ఆవిష్కరించారు.