రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ (J santosh kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజలు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు . మరో రెండు రోజుల్లో (మార్చి 25న) ఆర్ఆర్ఆర్ (RRR) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర యూనిట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ..ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని అన్నారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ కుమార్ సంకల్పం చాలా గొప్పదని..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతం కావాలన్నారు. బాహుబలి టీమ్ తో కూడా తాను గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా రాజమౌళి గుర్తు చేసుకున్నారు.
Jr NTR | పిల్లలను పెంచినట్టే మొక్కలనూ రక్షించాలి..
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నగ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలని జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని సూచించారు. ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలి కోరారు.
Ramcharan | మొక్కలు నాటిన ప్రతీసారి ఉత్సాహం వస్తుంది..
తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ చేశానని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని, ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని హీరో రామ్ చరణ్ (Ramcharan) అన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ను ఆర్ఆర్ఆర్ టీమ్ అభినందించింది.
ఆర్ఆర్ఆర్ టీమ్కు అభినందనలు..
సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని, సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మూవీ రిలీజ్ షెడ్యూల్ లో బిజీగా ఉండి కూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ లు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.