Ranaya Rao | కన్నడ నటి రన్యారావుకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధిం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది. విదేశాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా మార్గంలో లావాదేవీలు జరిపిన డబ్బులను ఉపయోగించినట్లు డీఆర్ఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని విచారణ సమయంలోనూ నటి రన్యారావు అంగీకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై బెంగళూరులోని 64వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. నటితో పాటు డీఆర్ఐ తరఫున వాదనలు విన్న కోర్టు మార్చి 27కి తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 3న దుబాయి నుంచి వచ్చిన రన్యారావు నుంచి రూ.12.56కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత నటిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా.. అధికారులు రూ.2.06కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67కోట్ల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నటితో పాటు తరుణ్ రాజును సైతం డీఆర్ఐ బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో తరుణ్రాజ్కు ఆమె ఆర్థిక సహాయం చేసినట్లు విచారణలో డీఆర్ఐ విచారణలో తేలిసంది. ఆమె పంపిన డబ్బుతోనే అతను దుబాయి నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తరుణ్ రాజు బెయిల్ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అతను విడుదలైతే పరారయ్యే అవకాశం ఉందంటూ బెయిల్ పిటిషన్ను డీఆర్ఐ వ్యతిరేకించింది. రన్యారావు అరెస్ట్ తర్వాత దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడని కోర్టుకు తెలిపారు. బంగారం అక్రమ రవాణా ఆపరేషన్లో భారత్లో అక్రమ బంగారాన్ని రవాణా చేయడం, పంపిణీ చేయడం, రవాణా వ్యవస్థను పర్యవేక్షించడంలో కీలక పాత్ర ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.