హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియోను కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ.. సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని పేర్కొన్నారు.
మహిళల రక్షణ కోసం చేపట్టాల్సిన సమగ్ర చర్యలపై పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఎక్స్ (ట్విటర్) ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పెట్టిన పోస్టుకు 264.1కే వ్యూస్ వచ్చాయి. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన ఆవశ్యకతపై ఎందరో నెటిజన్లు చర్చించారు.