హైదరాబాద్: దర్శక రుషి, కళాతపస్వి కే.విశ్వనాథ్ మృతిపట్ల పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్లిందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలుగువారి గొప్పతనాన్ని దశదిశలా చాటారని తెలిపారు. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య, ఐదు జాతీయ, ఐదు నంది, పది ఫిల్మ్ఫేర్ అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆయనను వరించాయని పేర్కొన్నారు.
ఆయన మరణం సినీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటన్నారు.
సినిమా ఉన్నంత కాలం ఆయన జనంతో ఉంటారని, ఆయన తీసిన సినిమాలు ఈ సమాజాన్ని ఎప్పటికీ చైతన్య పరుస్తునే ఉంటాయని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.
విశ్వనాథ్ మృతి పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులని చెప్పారు. వెండి తెరకు కళాతపస్వి, కళల కోసం తపించే కే.విశ్వనాథ్ లేరనే వార్త కలచివేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తాను విశ్వనాథ్ గారి అభిమానిని, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.
సంగీత, సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ సామాన్యుల జీవనాన్ని ఇతివృత్తంగా వెండితెరపై మలచిన తీరు కే. విశ్వనాథ్ ప్రతిభకు నిదర్శనమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కళాత్మక చిత్రాలను సైతం కమర్షియల్ సినిమా స్థాయిలో విజయవంతం చేయడం ఆయనకే సాధ్యమైందని చెప్పారు. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాదని యావత్ తెలుగు సమాజానికి తీరని లోటన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకొని తెలుగు సినిమా ప్రతిష్టను ఇనుమడింప చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.