Mia khalifa | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల మధ్య తాజా ఘర్షణలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఈ హింసాత్మక పరిస్థితులపై లెబనీస్-అమెరికన్ మీడియా పర్సనాలిటీ మియా ఖలీఫా తీవ్రంగా స్పందించారు. తన మాతృదేశం లెబనాన్పై జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేక ఆమె సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించడం ప్రస్తుతం వైరల్గా మారింది.
వీడియోలో మాట్లాడుతూ మియా ఖలీఫా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన కళ్లముందే దాడులు జరుగుతుంటే చూడటం చాలా కష్టం. దీనిని వివరించడానికి మాటలు రావడం లేదు” అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై ఆమె రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒకరోజు వీటిపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, లెబనాన్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. బీరుట్, బెకా వ్యాలీ, మౌంట్ లెబనాన్, సిడాన్ ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడులు తీవ్ర నష్టం కలిగించాయి. లెబనాన్ పౌర రక్షణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 254 మంది ప్రాణాలు కోల్పోగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం ఈ దాడులను సమర్థించుకుంటూ, హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. దక్షిణ లెబనాన్లో బఫర్ జోన్ ఏర్పాటుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.కాగా, ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించబోతుందనే ప్రచారంతో తెలుగువారికి మియా ఖలీఫా బాగా దగ్గరైంది.