‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదే లే..’ అనే మాటను నేను ఎక్కువగా వాడుతుంటా. నా హృదయానికి బాగా దగ్గరైన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఈ మాటను నేను ఎప్పుడూ గుర్తుచేసుకుంటా. అందరిలాగే నా జీవితంలో భయపడే క్షణాలుంటాయి. ఆ సమయంలో ధైర్యం చేసి ముందడుగు వేయాలి… పడిపోయినా, ఫెయిలయినా పరవాలేదు… తగ్గేదే లే అనుకుంటా. ఆ పట్టుదలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది’ అని అన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ‘ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్’ వీడియోను విడుదలచేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నా పుట్టినరోజును అభిమానుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ కంటే గొప్ప బహుమతి నాకు ఏదీ లేదు ‘అర్య’తో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ సినిమాతో దర్శకుడు సుకుమార్ నాకు ైస్టెలిష్స్టార్గా పేరుతీసుకొచ్చారు. ఇప్పుడు ‘పుష్ప’తో నన్ను ఐకాన్స్టార్గా మార్చి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు. సుకుమార్ ఇచ్చిన ఈ కొత్త పేరు నాకు చాలా నచ్చింది. నాకు సంబంధించి సినిమా, పాట, టీజర్ ఏదయినా ముందుగా అభిమానులకు నచ్చాలనే కోరుకుంటా. ఈ టీజర్ అందరికి నచ్చడం ఆనందంగా ఉంది. ఇతర భాషల వారు తెలుగు సినిమాల్ని ఆదరిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. వారి వల్లే తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది. వచ్చే పాతికేళ్లలో తెలుగు చిత్రసీమ ప్రపంచంలోని నంబవర్వన్ ఇండస్ట్రీల్లో ఒకటిగా నిలుస్తుంది. రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘పుష్ప’ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందరి మనసుల్ని హత్తుకుంటుంది. నేను, దేవిశ్రీప్రసాద్, సుకుమార్ చాలా రోజుల తర్వాత కలిసి చేసిన సినిమా ఇది’ అని తెలిపారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో బన్నీ అసమాన అభినయాన్ని చూస్తారు. తాను ఎంచుకునే కథలు, వస్త్రధారణతో పాటు అన్ని విషయాల్లో బన్నీ విలక్షణంగా ఉంటారు. అందుకే అతడిని ఐకాన్స్టార్ అని పిలవడమే కరెక్ట్. ఇదివరకు బన్నీని ఆర్య అని పిలిచేవారు. ఈసినిమాతో పుష్ప అని పిలుస్తారు. నిర్మాతలు లేకపోతే సినిమా లేదు. దర్శకుడు సుకుమార్గా కంటే బుచ్చిబాబు గురువుగానే నాకు ఎక్కువ పేరొచ్చింది. ఈ దశను నేను ఎంజాయ్చేస్తున్నాను’ అని తెలిపారు. తమ్ముడిగా కాకుండా ఫ్యాన్గా టీజర్ను చాలా ఎంజాయ్ చేశానని అల్లు శిరీష్ చెప్పారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘ఓ సినిమా బ్లాక్బస్టర్ అవ్వాలంటే కథతో పాటు యాక్షన్, కెమెరా, సంగీతం అన్ని చక్కగా కుదరాలి. ఆ హంగులన్నీ ఉన్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ సినిమాను అత్యాద్భుతంగా తీర్చిదిద్దారు. బన్నీ నటన అలరిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నాం’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత