సంక్రాంతికి ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకుల్ని పలకరించిన దర్శకుడు మారుతికి, ఆ సినిమా ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి నెక్ట్స్ ఆయన ఎవరితో సినిమా చేస్తారు? అనే విషయంపై కొన్ని రోజులుగా ఫిల్మ్వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మారుతి ఓ కథను సిద్ధం చేసుకున్నారు. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వరుణ్తేజ్, సాయిదుర్గతేజ్, రామ్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు హీరో అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే.. ఈ కథను చివరకు వైష్ణవ్తేజ్ ఓకే చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం కథల విషయంలో వైష్ణవ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్ని కథలు విన్నా ఆయన ధైర్యంగా ‘ఎస్’ చెప్పలేదు. కానీ మారుతీతో కలిసి నడవడానికి ఆయన సిద్ధమైనట్టు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నదని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మారుతి భావిస్తున్నారు. ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ని కూడా రిజిస్టర్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.