బాలీవుడ్ నటి మందిరాబేడీ భర్త, దర్శకనిర్మాత రాజ్ కౌశల్(49) బుధవారం ఉదయం గుండెపోటుతో ముంబయిలో తుదిశ్వాస విడిచారు. స్టంట్ కొరియోగ్రాఫర్గా సినీ జీవితాన్ని మొదలుపెట్టిన రాజ్కౌశల్ ‘ఆంథోనీ కౌన్ హై’, ‘షాదీ కా లడ్డూ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగానూ ‘మై బ్రదర్ నిఖిల్’, ‘ప్యార్ మే కభీ కభీ’ సినిమాలను రూపొందించారు. వాణిజ్య ప్రకటనల రూపకర్తగా ఆయనకు మంచి పేరున్నది. రాజ్కౌశల్ రూపొందించిన ‘షాదీ కా లడ్డూ’ సినిమాలో మందిరాబేడీ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రనిర్మాణసమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. పెద్దల అంగీకారంతో 1999లో మందిరాబేడీని రాజ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. గత ఏడాది ఓ బాలికను దత్తత తీసుకున్నారు. రాజ్కౌశల్ మరణంతో హిందీ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.