Adipurush | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. చిత్రం విడుదలైనప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా.. కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అదే సమయంలో మనోభావాలను దెబ్బతీశారంటూ పలువురు కోర్టులకెక్కారు. ప్రస్తుతం ఆయా పిటిషన్లపై విచారణ జరుగుతున్నాయి. మరో వైపు చిత్ర నిర్మాతలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద చిత్రంగా మారిన ‘ఆదిపురుష్’ టీమ్ను జులై 27న తమ ఎదుట హాజరుకావాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తున్న పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది.
చిత్ర దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్కుమార్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ సహా చిత్ర నిర్మాతలను జులై 27న హాజరుకావాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సైతం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. సినిమాపై అభిప్రాయాన్ని వెల్లడించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి అప్పీల్ను ప్రస్తావించాలని చిత్ర నిర్మాతల తరఫు న్యాయవాదికి సూచించింది.
ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టుపైనే చిత్రబృందం ఆశలు పెట్టుకున్నాయి. అయితే, స్టే విధించేందుకు నిరాకరిస్తే వారంతా తప్పనిసరిగా అలహాబాద్ హైకోర్టులో కావాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే, సినిమాపై నిషేధం విధించాలని కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు జూన్ 30న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలో డైలాగ్స్, శ్రీరాముడిని కించపరిచేలా ఉందని పిటిషనర్లు వాదించారు. సర్టిఫికేషన్ మార్గదర్శకాలను కోర్టుకు చెప్పాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను వ్యక్తిగత అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది.