హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్లోని నివాసంలో మృతి చెందారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లె. 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో చక్రి సంగీత సారథ్యంలో ‘మళ్లీ కూయవే గువ్వా’ పాటతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ మంచి హిట్ కావడంతో వరుస అవకాశాలతో పాటలు రాసి గేయ రచయితగా అవకాశాలు వచ్చాయి.
20 ఏళ్ల ప్రస్థానంలో 1300కుపైగా పాటలు రాశారు. సినిమా పాటలే కాకుండా.. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి కథకుడిగా విశేష ఆదరణ పొందారు.