దాతల సహకారంతో అభివృద్ధి బాట
పల్లె ప్రగతి పనుల లక్ష్యం పూర్తి
ఉత్తమ పంచాయతీగా ఎంపిక
కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పాలకవర్గం
పెనుబల్లి, మార్చి 24: ఆ పల్లె అభివృద్ధిలో మరుమల్లెగా మారింది. గ్రామస్తుల ఐక్యతారాగం ప్రగతి పథంలో నడిపించింది. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చాటిచెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేసింది. ఆయన ప్రశంసలు అందుకున్నది. అధికారులు, పాలకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. గ్రామస్తులు, దాతల సహకారానికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహంతో పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం ఆదర్శ పంచాయతీగా రూపుదిద్దుకున్నది. సీఎం మెచ్చిన పల్లెలో జరిగిన అభివృద్ధి, పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు, ఒనగూరిన సౌకర్యాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నిజం చేస్తూ కొత్త కారాయిగూడెం ఆదర్శ పంచాయతీగా అవతరించింది. అసెంబ్లీ సాక్షిగా గతేడాది మార్చిలో సీఎం కేసీఆర్ పంచాయతీలో జరిగిన ప్రగతిని అభినందించారు. అధికారులను, పాలకవర్గాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గ్రామంలో జరిగిన అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, దాతల సహకారంతో సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి అభివృద్ధి పనులు చేపట్టారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. వీధివీధికి ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్ యార్డుకు తరలిస్తూ పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. గ్రామంలో చేపట్టిన ప్రతి పనిలో గ్రామస్తులను భాగస్వాములను చేస్తుండడంతో సులభంగా పల్లె ప్రగతి లక్ష్యాలు నెరవేరాయి. అంతేకాదు పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. కలెక్టర్ కర్ణన్ చేతుల మీదుగా పాలకవర్గం అవార్డును సైతం అందుకున్నది.
దాతల సహకారం మరువలేది..
గ్రామస్తులు విరాళాల ద్వారా ఇచ్చిన సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్తకారాయిగూడెం ఆదర్శ పంచాయతీగా రూపుదిద్దుకున్నది. గ్రామంలో వైకుంఠధామ నిర్మాణానికి పోట్రు బుల్లెయ్య మనవళ్లు పోట్రు వెంకయ్య, రాజారావు, నర్సింహారావు, సత్యంబాబు సుమారు రూ.18 లక్షల విలువ గల ఎకరా భూమి ఇచ్చారు. గ్రామానికి చెందిన యువకులు రూ.50 వేల విలువ కలిగిన ఎల్ఈడీ వీధిలైట్లు సమకూర్చారు. వాటర్ ట్యాంకు నిర్మాణానికి యలమంచిలి సాంబశివరావు రూ.1.20 లక్షలు అందించారు. మరికొందరు దాతలు సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.52వేలు విరాళంగా ఇచ్చారు. తడి, పొడి చెత్తబుట్టలు ఏర్పాటు చేసేందుకు సగ్గుర్తి ప్రకాశ్రావు రూ.10వేలు, యలమంచిలి సాంబశివరావు రూ.10వేలు, వైకుంఠధామంలో బోరు నిర్మాణానికి మేడా రామారావు రూ.20 వేలు అందించారు. ఇలా అన్ని వర్గాల నుంచి సుమారు రూ.23 లక్షలు సేకరించి పాలకవర్గం అభివృద్ధి పనులు చేపట్టింది.
గ్రామస్తుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి..
పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ప్రజలను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేశాం. గ్రామస్తులు అభివృద్ధికి విరివిగా విరాళాలు అందించారు. పల్లె ప్రగతి లక్ష్యాలను చేరుకున్నాం. మా పంచాయతీ జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.